ప్రచురించిన వర్గము కధలు - కవితలు
ఫలార్హత
విత్తనం నేలలో నాటగానే
బాధ్యత తీరిపోయినట్లుగాదు
బీజాన్ని పాతిపెట్టిన్నాటినుంచి
ఫలసాయానికి అర్రులు సాచడం
రాట్నానికి ఏకు ఎక్కించకుండా
గాల్లోంచి నూలు తీయబూనడం
గింజ నాటే ముందుగానే
భూమిని మొలకకు సిద్ధం చేయాలి
మొక్కకు అనువుగా పాదుచేయాలి
సారవంతమైన మట్టిని ప్రోదిచేయాలి
నీటితో నేలను పదును చేయాలి
భూసారాన్ని పెంచడానికి
అవసరమైతే ఎరువు వేయాలి..
శివుడికి అభిషేకం చేసినట్లు
గింజను జలసేచనంతో చల్లబరచాలి
తననుతాను రెండు చెక్కలుగా విస్ఫోటించుకొని
మొక్కగా రూపొండి, గింజ
తూర్పుకొండనుండి తొంగిచూచే
తొలిపొద్దుపొడుపులా
తలను పైకి నిక్కిస్తుంది..
ఆహ్వానించని అతిధిలా భావించి
పశువులు దాన్ని మట్టుపెట్టకుండా
కంచెకవచాన్ని తొడగాలి
రక్షణగా నిలవాలి.
మొక్క వృక్షమయ్యేంతవరకూ
మెలకువతో కాపాదాలి..
తనకు చేసే శుశ్రూషలకు
తృప్తిచెందిన చెట్టు
పెరిగి పెద్దదై కృతజ్ఞతతో
ఫలసాయాన్ని పంచి పెడుతుంది..
నిరంతరకృషి మాత్రమే
ఫలనుభవానికి
అర్హత చేకూరుస్తుంది
-సి హెచ్.వి. బృందావన రావు
ప్రచురణ – ధ్యానమాలిక (జూన్ ‘06)