బృందావన రావు గారి వ్రాత పత్రి


నీటి చుక్క కోసం…
ఆగష్టు 28, 2006, 10:59 అపరాహ్నం
ప్రచురించిన వర్గము కధలు - కవితలు

ఆదిమ కాలంనాటి సరస్వతీ నది
అవని మీద నేడు కనిపించదు
అంతర్వాహిని అయిందనుకొని
ఆత్మవంచన చేసుకొంటున్నాం.

చెయ్యేరూ, గుండ్లకమ్మా, మూసీ లాంటి
చిన్న చిన్న వంకవాగులన్నీ
ఒకప్పుడిక్కడ ఏరుండేదని
ఒండ్రు దిబ్బలతో సాక్ష్యం చెపుతున్నాయి.

కృష్ణ కృశించి పోయింది.
గోదావరి గోష్పాదమవుతున్నది.
‘విదారించు ఎదన్, వట్టి ఎడారి తమ్ముడూ’ అని
కన్నీటి కైతలు రాయించుకుంది పెన్న.

ఆగామి కాలంలొ అంగిలి తదుపుకోవడానికి
నిజంగా దొరుకుతుందా నీటిచుక్క?

జలగీతాలు రాస్తున్నారు కవులు
జలయజ్ఞాలంటున్నారు ప్రభువులు
జలబిందువును కాపాడుకోవడం వినా
జనానికి వేరు దారి శూన్యం.

నిర్మల పేయజలంలేని – నిర్జల లోకం రాబోతోందా?
రాబోయే తరాలకోసం – జల సంరక్షణ అనివార్యం.
రేపటి వసంతం కోసం – నేడు విత్తనం నాటు
నేటి కోసం మాత్రమే బ్రతకడం – నేరస్థుల అలవాటు.

-సిహెచ్.వి. బృందావన రావు

ప్రచురణ : నడుస్తున్న చరిత్ర (జులై ‘06)